కరోనా నుంచి కోలుకున్నవారికి 9 నెలల తర్వాతే టీకా
కేంద్రానికి సూచించిన నిపుణులు
కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారు 6 నెలల తరువాతే టీకాలు వేయించుకోవాలని ఇప్పటివరకు నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. ఆ గడువును 9 నెలలకు పొడిగించాలని నిపుణులు సూచించారు. ఈ మేరకు నేషనల్ టెక్నికల్ అడ్వయిజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) అనే ప్రభుత్వ పానెల్ కేంద్రానికి సూచనలు చేసింది. వైరస్ నుంచి కోలుకున్నవారికి ఇప్పటివరకు 6 నెలల గడువుతో టీకాలు ఇచ్చేవారు. ఆ గడువును 9 నెలలకు పెంచాల్సిందిగా సూచించారు. ఇటీవలే రెండో డోసు గడువును 6 నుంచి 12 వారాలకు పొడిగించగా, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. ఇక వైరస్ నుంచి కోలుకొని ఇతర కొవిడ్ రోగులకు ప్లాస్మాను దానం చేసినవారు 3 నెలల వరకు టీకా కోసం ఆగాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా టీకాలకు కొరత ఏర్పడినందునే వ్యాక్సిన్ ఇచ్చేందుకు గడువును పెంచుతున్నారని వైద్య నిపుణులు అంటున్నారు. టీకాలను ఎక్కువ విరామంతో ఇవ్వడం వల్ల మెరుగ్గా పనిచేస్తాయని, అందువల్లే డోసుల మధ్య సమయం పెంచుతున్నామని కేంద్రం చెప్తున్నది. ఈ క్రమంలో టీకాలకు గడువును పొడిగిస్తుండడాన్ని పలువురు తప్పు బడుతున్నారు. టీకాలు లేనందునే కేంద్రం ఇలా వ్యవహరిస్తుందని ఆరోపిస్తున్నారు.