ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్..ఎక్కడ తయారు చేశారో తెలుసా..
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తొలి స్కూటర్ ను ఓలా ఎలక్ట్రిక్ సీఈవో భవీశ్ అగర్వాల్ మార్కెట్ లోకి విడుదల చేశారు. ఆ ఫొటోను తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తమిళనాడులోని ఫ్యాక్టరీలో దానిని తయారు చేసినట్టు పేర్కొన్నారు. మహమ్మారి విజృంభిస్తున్న సమయంలోనూ కష్టపడి ఆరు నెలల్లోనే స్కూటర్ ను సిద్ధం చేశామన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో స్కూటర్ ఉత్పత్తి మొదలైందన్నారు. సిబ్బంది అంకితభావంతో పనిచేశారన్నారు. కాగా, గత నెలలో ప్రీ బుకింగ్ లు ఓపెన్ చేయగా.. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో లక్ష మందికి పైగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను బుక్ చేసుకున్నారు. రూ.500 చెల్లింపుతో బుకింగ్ కు అవకాశం కల్పించారు. ఇప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతుండడం, వాతావరణం కలుషితం అవుతుండడంతో ప్రత్యామ్నాయాలపై జనం దృష్టి పెట్టారు. అందులో భాగంగా విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.