కరోనాకు ఎంత మంది డాక్టర్లు బలయ్యారో తెలుసా?

కరోనా బారిన పడినవారిని కాపాడటంలో వైద్యులు ముందుంటారు. మరి అదే వైరస్ కారణంగా ఎంత మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయారో తెలుసా. దేశ‌వ్యాప్తంగా కరోనా బారినపడి ప్రాణాలు విడిచిన డాక్టర్ల సంఖ్య అక్షరాలా 162. ఇదే విషయాన్ని మంగళవారం కేంద్ర ఆరోగ్య‌శాఖ ప్రకటించింది. పార్ల‌మెంట్‌లో లిఖిత‌పూర్వ‌క స‌మాధానంలో ప్ర‌భుత్వం ఈ విష‌యాన్ని చెప్పింది. జ‌న‌వ‌రి 22 నాటికి  క‌రోనా వ‌ల్ల 107 మంది న‌ర్సులు, 44 మంది ఆశా వ‌ర్క‌ర్లు కూడా ప్రాణాలు కోల్పోయిన‌ట్లు తెలిపింది. మ‌రో వైపు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు మంగళవారం భారీగా తగ్గాయి. గతేడాది జూన్‌ 7వ తేదీ తర్వాత తక్కువగా పాజిటివ్‌ కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 8,635 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,07,66,245కు పెరిగింది. తాజాగా 13,423 మంది డిశ్చార్జి కాగా.. ఇప్పటి వరకు 1,04,48,406 మంది కోలుకున్నారని మంత్రిత్వశాఖ పేర్కొంది. మరో 94 మంది వైరస్‌ ప్రభావంతో మరణించగా.. మృతుల సంఖ్య 1,54,486కు పెరిగింది.

ప్రస్తుతం దేశంలో 1,63,353 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని చెప్పింది. టీకా డ్రైవ్‌లో భాగంగా ఇప్పటివరకు 39,50,156 మందికి వ్యాక్సిన్ వేసినట్లు మంత్రిత్వశాఖ వివరించింది. సోమవారం ఒకేరోజు దేశవ్యాప్తంగా 6,59,422 కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) తెలిపింది. ఇప్పటి వరకు 19,77,52,057 నమూనాలను పరిశీలించినట్లు వివరించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *