కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న కమల హ్యారిస్!

ప్రజలందరూ వ్యాక్సిన్లు తీసుకునేలా ప్రోత్సహిస్తూ గత నెల 29న అమెరికా ఉపాధ్యక్షురాలు కమల హ్యారిస్‌ వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నారు. ఈ క్రమంలో ఆమె మంగళవారం రెండో డోస్ తీసుకున్నారు. దేశ ప్రజలంతా వ్యాక్సిన్లు వేయించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సందేశమిచ్చారు. ఆమె మోడెర్నా వ్యాక్సిన్ వేయించుకుంటుండగా టీవీల్లో లైవ్ లో ప్రసారం చేశారు. టీకా ప్రజల జీవితాలను రక్షిస్తుందని చెప్పారు. కాగా, వ్యాక్సిన్ల సమర్థతపై ప్రజలు ఆందోళన చెందకుండా వాటిపై నమ్మకాన్ని పెంచడానికి ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతోపాటు పలువురు ప్రముఖులు కూడా వ్యాక్సిన్లు వేయించుకున్నారు. ప్రస్తుతం అమెరికాలో మోడెర్నాతోపాటు పైజర్ వ్యాక్సిన్లను ప్రజలకు వేస్తున్నారు. తన 100 రోజుల పాలన పూర్తయ్యేలోగా అమెరికాలో సుమారు 10 కోట్ల మందికి వ్యాక్సిన్లు వేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *