కరోనా వ్యాక్సిన్ ఎక్స్ పైరీ గడువు 6 నెలలే!
కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు అనేక దేశాలు వ్యాక్సిన్ ను తయారుచేస్తున్నాయి. ఇప్పటికే పలు దేశాలు వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేశాయి. భారత్ లో కూడా టీకా పంపిణీ జోరుగా కొనసాగుతున్నది. ఈ క్రమంలో నిపుణులు కీలక సూచనలు చేశారు. అందుబాటులో ఉన్న టీకాలను వెంటనే వినియోగించాలని, వాటి ఎక్స్ పైరీ గడువు 6 నెలలు మాత్రమే ఉంటుందని స్పష్ఠంచేశారు. వీలైనంత త్వరగా.. అందరికీ టీకాలు వేయాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న టీకాలు తయారైనప్పటి నుంచి కాలపరిమితి 6 నెలల మాత్రమేనని స్పష్టంచేస్తున్నారు.
భారతదేశంలో రెండు కంపెనీలు కొవిషీల్డ్, కొవాగ్జిన్ (Covishield, Covaxin) టీకాలను తొలి దశలో ఇస్తున్నారు. ఈ నెల 16వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవగా, ఇప్పటివరకు 20 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు. ఓ కంపెనీ ఇప్పటికే 2 కోట్ల డోసులను ప్రభుత్వానికి అందచేసింది.
మరో 60 లక్షల కోట్ల డోసులు కంపెనీ వద్ద ఉన్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న టీకాలను 6 నెలల్లోపు వినియోగించుకోలేకపోతే అవన్నీ పనికి రాకుండా పోతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. టీకా వినియోగ గడువును తయారీ తేదీ నుంచి గరిష్ఠంగా ఏడాదిపాటు ఉండేలా చూడాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకు పరిశోధనలు కూడా జరుగుతున్నాయి.