కారుతో ఢీకొట్టి కార్పొరేటర్ దారుణ హత్య
పాతకక్షలతో ఓ నగర కర్పొరేటర్ ను అర్ధరాత్రి కారుతో ఢీకొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ 9వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్న కంపర రమేష్, అతని స్నేహితులు సతీష్, వాసులతో కలిసి కార్ల మెకానిక్ షెడ్ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి మద్యం సేవించారు. అదే సమయంలో చిన్నా అనే వ్యక్తికి రమేష్ ఫోన్ చేయడంతో ఆయన తన తమ్ముడితో కలిసి అక్కడికి వచ్చారు. తన తమ్ముడి పుట్టిన రోజు అని, కేక్ కటింగ్కు రావాలని చిన్నా ఆహ్వానించగా.. రమేష్ తిరస్కరించారు. అంతా ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సమయంలో కారు తాళాల విషయంలో చిన్నా, రమేష్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో చిన్నా కారుతో ఢీ కొట్టి రమేష్ను హతమార్చాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. పాతకక్షలే హత్యకు కారణమని భావిస్తున్నట్టు వివరించారు.