చైనాపై ‘దలైలామా’ విమర్శలు..ఇండియాలోనే ఉంటా..
ఆన్లైన్ వార్తా సమావేశంలో టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా పాల్గొన్నారు. తైవాన్ను సందర్శించడం గురించి ఆయనని అడిగినప్పుడు, తైవాన్, చైనా ప్రధాన భూభాగాల మధ్య సంబంధాలు “చాలా సున్నితమైనవి కాబట్టి భారతదేశంలో ఉండటానికి ఇష్టపడతానని చెప్పారు. చైనా అధినేత జింగ్ పింగ్ ని కలవడానికి “తనకు ప్రత్యేకంగా ఎలాంటి ప్రణాళికలు లేవని’ కూడా చెప్పారు. చైనా నేతలపై విమర్శలు చేసిన దలైలామా.. వాళ్లు విభిన్న సంస్కృతుల్లో ఉన్న తేడా గమనించలేరన్నారు. ఆ దేశానికి చెందిన ప్రధాన హన్ తెగ ఆధిపత్యం ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు.గత డిసెంబర్ లో ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. ద టిబెటన్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్ ఆఫ్ 2020 (టీపీఎస్ఏ) ప్రకారం టిబెట్ ప్రధాన నగరమైన లాసాలో యుఎస్ కాన్సులేట్ ఏర్పాటు చేయనుంది. అలాగే దలైలామాకు వారసుడిని ఎన్నుకునే సంపూర్ణ హక్కు టిబెటన్లకు దక్కనుంది. దలైలామాను చైనా ఒక ప్రమాదకరమైన వేర్పాటువాదిగా భావిస్తోంది. అమెరికా కాంగ్రెస్ నుంచి తాజా మద్ధతు రెండు అగ్రరాజ్యాల మధ్య ఇప్పటికే వున్న ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం వుంది.