మ్యూజియంలో 60లక్షల ‘మృతదేహాలు’..ఎక్కడో తెలుసా..
మ్యూజియంలో ఏం ఏం భద్రపరుస్తారో అందరికీ తెలుసుగా..విలువైన వస్తువులతో పాటు..పురాతన వస్తువులని దాస్తుంటారు. అయితే మృతదేహాలను భద్రపరిచన మ్యూజియం గురించి మీకు తెలుసా. ఇంతకీ అది ఎక్కడ వుందో తెలుసా..సుందరనగరమైన ప్యారీస్ లో. ‘ప్యారీస్ కాటకోంబ్స్’ పేరు ఎప్పుడైన విన్నారా అందులో దాదాపు 60 లక్షల మృతదేహాలను భద్రపరిచిన మ్యూజియం ఉంది. దీనికి సంబంధించిన చరిత్ర 18వ శతాబ్ధంలోని చివరి భాగం నుంచి ప్రారంభమైందట. చనిపోయినవారి ఎముకలు, పుర్రెలతో నిర్మించిన 2.2 కి.మీ పొడవున్న ఈ మొత్తం గోడ దాదాపు 800 హెక్టార్లలో విస్తరించి ఉందట . అయితే ఈ మొత్తం చూడటానికి పర్యటకులకు అనుమతించలేదు. ఈ సొరంగంలోని కొన్ని భాగాలు మాత్రమే చూసేందుకు అనుమతి ఉంది. ఏదిఏమైనప్పటికీ సమాధులను చూస్తేనే భయమేస్తుంది. అలాంటిది ఏకంగా అస్థిపంజరాలతో కట్టిన ఈ గోడను చూడటానికి అన్ని వేల మంది వెళ్తుండటం విశేషమేగా మరి.
చనిపోయినవారిని పాతిపెట్టడానికి నగరంలో ఖాళీ స్థలం కూడా లేని కాలంలో దీనిని నిర్మించారట. 1785లో మరే ఇతర శ్మశానవాటికల్లో అంత్యక్రియలు చేయలేనంతగా మరణాలు సంభవించాయి. వర్షం కురవడంతో శ్మశానవాటికల నుంచి ఒక్కసారిగా శవాలు వీధుల్లోకి చొచ్చుకువచ్చాయట. దాంతో మృతదేహాలను సున్నపు గనుల సొరంగంలో పడవేశారట. ఇతర ప్రాంతాల నుండి కూడా మృతదేహాలను తీసుకువచ్చి ఇక్కడ పడవేశారు. అనతికాలంలోనే దాదాపు 60 లక్షల మృతదేహాలు ఇక్కడ నిక్షిప్తమయ్యాయి. ఆ తర్వాత ఈ మృతదేహాల ఎముకలు, పుర్రెలతో సుమారు 2.2 కిలోమీటర్ల పొడవైన గోడను నిర్మించి మ్యూజియంగా మార్చారు. ఈ గోడను భూమిలోపల 20 మీటర్ల లోతులో నుంచి కట్టినట్లు టాక్. అందుకే ఈ స్థలాన్ని ‘సమాధుల నేలమాళిగ బేస్మెంట్ ఆఫ్ టోంబ్స్’ అని పిలుస్తారు. ఇప్పుడు ఇది పర్యాటక ప్రదేశంగా పేరుగాంచింది. దీనిని చూడటానికి ప్రపంచవ్యాప్తంగా సుదూర ప్రాంతాల నుండి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు.